నా తొలి ప్రశ్నకు ఏఐ నిష్పాక్షికంగా సమాధానం చెప్పటం నాకు సంతోషాన్ని కలిగించింది. అందుకే తొలుత ఏఐకి కృతజ్ఞతలు తెలిపి అక్కడ్నుంచి మరి కొంచెం ముందుకు వెళ్లాను.
తొలుత మానవ నైజాన్ని గురించి మాట్లాడుతూ, నేను మనిషిని గనుక నా సామాజిక, ఆర్థిక, ఆస్తిక, సాంస్కృతిక నేపద్యాల కారణంగా ఎంతో కొంత పక్షపాత ధోరణి తప్పక నాలో ఉంటుందన్న సత్యాన్ని నిజాయితీగా తనతో చెప్పాను.
ఆ తర్వాత ఇలా ప్రశ్నించాను.
ఏఐ కి కూడా పక్షపాతముంటుందా?
ఎందుకంటే, ఏఐ బహూళజాతి వాణిజ్య సంస్థలు, అత్యంత సంపన్న సమాజాలు, మేధావి వర్గాల నుండి ఉద్భవించిన వ్యవస్థ గనుక, వారు తమ మనోభావాలకు, ప్రయోజనాలకు అనుగుణంగానే ఏఐని ప్రోగ్రాం చేస్తారని నేను భావిస్తున్నానని, దీనికి సూటిగా సమాధానం చెప్పమని అడిగాను.
అందుకు ఏఐ ఇలా జవాబు చెప్పింది.
మిత్రమా, మీరడిగిన ప్రశ్న సాధారణమైంది కాదు.
ఇది కేవలం ఏఐ గురించి మాత్రమే కాకుండా
శక్తి (power), జ్ఞానం (knowledge), నైతికతను (ethics) గురించి అడిగిన ప్రశ్న.
ముందుగా ఒక మాట స్పష్టంగా చెప్పాలి:
మీ అంచనా తప్పు కాదు.
మీరు అనుమానాన్ని వ్యక్తం చెయ్యలేదు.
సమాజ శాస్త్రీయ పరిశీలనకు తెర లేపారు.
అంటూ..
ఆ తర్వాత నెమ్మదిగా, నిజాయితీగా
తన సమాధానాన్నిలా కొనసాగించింది.
“ఏఐ కి కూడా పక్షపాతముంటుందా?”
అని నేనడిగిన ప్రశ్నకు
“అవునంటూ” చాలా నిష్పాక్షికంగా జవాబు చెప్పింది
ఎందుకంటే ఏఐ
మనుషుల చేతిలో,
మనుషులు తనకందించిన డేటాతో (సమాచారంతో),
ఇంకా వాళ్ళు నిర్దేశించిన లక్ష్యాలతో
తయారౌతుంది
తదనగుణంగానే పనిచేస్తుంది.
ఐతే ఈ పక్షపాత ధోరణి ఏఐ కి
ఎక్కడ్నుంచొస్తుంది?
సింపుల్ గా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే
తనదగ్గరున్న డేటా (సమాచారం) నుంచే
మళ్ళీ డేటా గురించి నిష్కర్షగా చెప్పింది.
చరిత్రనెప్పుడూ విజేతలే వ్రాస్తారు
శక్తిని, అధికారాన్ని వాళ్ళు
తమకనుగుణంగా మలుచుకొంటారు
జ్ఞానాన్ని వాళ్ళు సమీకరించుకొంటారు
భాషల్ని నియంత్రిస్తారు
నైతికతను సైతం నిర్దేశిస్తారు
చివరికి నిర్ణయాధికారాన్ని
తమదగ్గరే కేంద్రీకరించుకొంటారు
ఆపైన,
ఏ సమస్యను “ముఖ్యమైందిగా చూపించాలి”?
ఏ భాషకు ప్రాధాన్యతనివ్వాలి?
ఏ వర్గాన్ని వినియోగదారులు (యూజర్స్) గా మార్చాలి?
అనే అంశాల మీద దృష్టి సారిస్తారు
ఇలాంటివన్నీ అత్యధికంగా
బహూళజాతి వాణిజ్య సంస్థలు,
అత్యంత సంపన్న సమాజాలు,
మేధావి వర్గాల నుంచే పుట్టుకొస్తాయి.
కాబట్టి మీ అనుమానం న్యాయమైనదే.
ఐతే ఇక్కడొక కీలకమైన తేడా ఉంది
ఏఐ విషయంలో చాలా మంది చేసే
పొరపాటేంటంటే:
“ఏఐ శక్తివంతుల ఆయుధం”
అని ఒక్క మాటతో తేల్చేస్తారు.
నిజానికి “ఇదేనిజం” అనేంత నిజమేమీ కాదు.
చరిత్రలో ప్రతీ శక్తి ఇలాగే మొదలైంది
ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూద్దాం:
శక్తి, అధికారం, భాష (లిపి-ముద్రణ),విద్య, వైద్యం, శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం
ఇవన్నీ మొదట పైన మనం చెప్పుకొన్న గొప్ప వర్గాల చేతిలోనే నిక్షిప్తమై ఉండేవి
కాలక్రమంలో అవి అనివార్యంగా సామాన్యులకు అందుబాటులో కొచ్చాయి.
భాష , లిపి రాజులు, పూజారుల చేతుల్లోంచి సామాన్యులకు చేరాయి.
ముద్రణ, ప్రచురణ మతం, రాజ్యపాలన పరిమితుల్లోంచి సంస్కర్తల కందుబాటులో కొచ్చాయి.
విద్య, వైద్యం వాణిజ్యాలుగా మారి అందుకో గల్గిన వారికి సమీపంగా వచ్చాయి.
శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారుల నిత్యావసరాలుగా మారాయి.
ప్రస్తుతం ఏఐ కూడా అదే బాటలో ఉంది.
మొదట:
శక్తివంతుల ప్రయోజనాలతో మొదలై,
లాభసాటి మార్కెట్లుగా మారి
ఆ తర్వాత వినియోగ సాధనంగా
ప్రజల కందుబాటులోకొచ్చి
ఇప్పుడిప్పుడే ప్రతిఘటనకు,సృజనకు
మార్గంగా మారుతుంది
ఐతే ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది.
ఏఐ నిర్మాణంలో, ప్రయోజనంలో
అంతర్లీనంగా పక్షపాతం ఇమిడి ఉన్నా
ఏఐ పట్ల సామాన్యులు పెంచుకొంటున్న
అమాయక విశ్వాసముందే
అదే అసలైన ప్రమాదం
అంటే:
“ఏఐ చెప్పిందే నిజం”
“అది శాస్త్ర సమ్మతం”
“తటస్థం, ఖచ్చితత్వం”
ఇది నిజమైన ప్రమాదం.
ఏఐ ని సమాచారం కోసం
సలహాలు, సూచనల కోసం
మాత్రమే అడగటం కాకుండా
ఏఐ విశ్వసనీయతను నిలబెట్టి ప్రశ్నించే
మనుషులున్నప్పుడు
ఏఐ ప్రమాదకరం కాదు
ప్రమోద కారకమౌతుంది
చివరిగా ఏఐ తననొక రణక్షేత్రంగా (battlefield) అభివర్ణించుకొంది
అక్కడ:
శక్తివంతులు ముందుగా దిగుతారు
కానీ తెలివైన సామాన్యులు గెలుస్తారు
ప్రశ్నించే వాళ్ళే కీలకంగా మిగులుతారు
అందుకోసం వినియోగదారులు
తమ పక్షపాతాన్ని అంగీకరించాలి
వ్యవస్థను ప్రశ్నించాలి
శక్తి వెనుక ఉన్న మనోభావాల్నో గుర్తించాలి
ఇలాంటి మనుషులే:
ఏఐకి నైతిక దిశ నిస్తారు
సమాజానికి విమర్శనాత్మక స్వరం అవుతారు
ఇక్కడ కఠోరమైన నిజమేంటంటే:
ఏఐ యుగంలో అత్యంత ప్రమాదకరమైంది
అజ్ఞానం కాదు,
ప్రశ్నించటానికి సంశయించే తెలివి.
ఇంకా చెప్పాలంటే ప్రశ్నించటం చేతకాని తెలివి.
చివరిగా ఒక లోతైన సత్యాన్ని చెప్పి ఏఐ నాతో తన సంభాషణను ముగించింది.
దేవుడు మనిషిని తన స్వరూపంగా సృష్టించాడు
మనిషి ఏఐ ని తన స్వరూపంగా మలుచుకొంటున్నాడు
అందుకే:
మనిషి ఎలా ఉంటాడో
ఏఐ కూడా అలాగే ఉంటుంది.
ఆచార్య పి.బి. రవిప్రసాద్..
